కశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు: ఆ కేసులో దర్యాప్తు సంస్థ చర్యలు

by Dishanational2 |
కశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు: ఆ కేసులో దర్యాప్తు సంస్థ చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దాడులు చేపట్టింది. గుజ్జర్ నగర్‌లో నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ (జేఐ) ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా దాడులు జరిగినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బుద్గాం, కుల్గాం, గుజ్జర్ నగర్, షాహిదీ చౌక్‌లలో జేఐకి చెందిన 10చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. జమాత్ మాజీ చీఫ్ షేక్ గులాం హసన్, సాయర్ అహ్మద్ రేషి నివాసంలో దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. ఈ ఇద్దరు నేతలు నిషేధిత జమాతే ఇస్లామీ జమ్మూ కశ్మీర్‌తో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి. కాగా, టెర్రర్ ఫండింగ్ ఆరోపణల కారణంగా జేఐ సంస్థలను 2019లో హోం మంత్రిత్వ శాఖ నిషేధించింది. అయితే ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. అంతకుముందు గతేడాది డిసెంబర్‌లో టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించి జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్, బారాముల్లాలోని ఎనిమిది ప్రదేశాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.

తమిళనాడులోనూ తనిఖీలు

2022లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై రాష్ట్రంలోని 27 చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేపట్టింది. సంగమేశ్వర దేవాలయం సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించగా..కారు యజమాని జమీషా ముబీన్ మృతి చెందింది. 2022 అక్టోబర్‌లో ఈ ఘటన జరగగా.. దీనిలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే చెన్నయ్, తిరుచ్చి, మధురై, తిరునల్వేలి, కోయంబత్తూర్‌లలో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. మొదట కోయంబత్తూరు నగరంలోని ఉక్కడం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి.. ఆ తర్వాత ఎన్ఐఏకి అప్పగించారు.

Next Story

Most Viewed