‘ప్రధాని మోడీ మీడియా సమావేశాలు ఎందుకు పెట్టరు?’ ప్రశ్నించిన న్యూజిలాండ్ జర్నలిస్ట్

by Ramesh Naini |

ప్రధాని నరేంద్ర మోడీ మీడియా సమావేశాలు నిర్వహించకపోవడంపై న్యూజిలాండ్ పర్యటనలో ఓ విదేశీ జర్నలిస్ట్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

‘ప్రధాని మోడీ మీడియా సమావేశాలు ఎందుకు పెట్టరు?’ ప్రశ్నించిన న్యూజిలాండ్ జర్నలిస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మీడియా సమావేశాలు నిర్వహించకపోవడంపై న్యూజిలాండ్ పర్యటనలో ఓ విదేశీ జర్నలిస్ట్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న ప్రధాని మోడీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఆర్థిక సహకారంపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత దౌత్యవేత్తలతో జరిగిన ముఖాముఖిలో ఓ న్యూజిలాండ్ జర్నలిస్ట్.. ‘ప్రధాని మోడీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు?’ అని ప్రశ్నించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ సీనియర్ అధికారి రుద్రేంద్ర టాండన్ స్పందిస్తూ, ప్రధాని రాజకీయ శైలిపై ఒక ప్రభుత్వ అధికారిగా తాను వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు. అయితే, భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని వివరిస్తూ.. ‘భారతీయ నాయకులు సాధారణంగా ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలకే మొగ్గు చూపుతారు. మధ్యవర్తుల ద్వారా మాట్లాడటానికి వారు ఇష్టపడరు. ప్రధాని మోడీ ఈ ప్రత్యక్ష ప్రజా సంబంధాల కళలో అత్యంత నైపుణ్యం సాధించారు. అందుకే ఆయన వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి, దేశంలో అత్యధిక కాలం పనిచేస్తున్న ప్రధాన మంత్రులలో ఒకరిగా నిలిచారు’ అని టాండన్ వివరించారు.

గతంలో నార్వే పర్యటనలోనూ..

కాగా, గతంలో మే నెలలో నార్వే పర్యటనలోనూ జర్నలిస్ట్ హెల్లే లింగ్ అనే మహిళా విలేకరి మోడీని ఇదే తరహా ప్రశ్నించగా, అప్పట్లో ఆయన స్పందించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ చారిత్రాత్మక పర్యటనకు గుర్తుగా ఆక్లాండ్‌లోని ప్రసిద్ధ ‘స్కై టవర్’ను భారత త్రివర్ణ పతాక రంగులతో విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ పర్యటనలో మోడీ భారతీయ ప్రవాసులతో (డయాస్పోరా) భేటీ అవ్వడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story