మహారాష్ట్రలో ఇక కొత్త రూల్.. మరాఠీ రాకపోతే ఏకంగా లైసెన్స్ రద్దు

by Kema Shiva Kumar |

మహారాష్ట్రలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మహారాష్ట్రలో ఇక కొత్త రూల్.. మరాఠీ రాకపోతే ఏకంగా లైసెన్స్ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు షాకిచ్చేలా మహారాష్ట్ర సర్కార్ (Government of Maharashtra) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలంటే ఇకపై మరాఠీ భాష తప్పనిసరి అని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. మే 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని 59 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (RTO) డ్రైవర్లకు స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డ్రైవర్లు మరాఠీ చదవడం, రాయడం వచ్చని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మరాఠీ భాషలో కనీస ప్రవేశం లేదని తేలితే, సదరు డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

కాగా, ఇప్పటికే ఉన్న స్థానిక భాషా నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు, డ్రైవర్ యూనియన్లు భగ్గుమంటున్నాయి. ఇక మరాఠీ భాషపై గౌరవం ఉండటం మంచిదే కానీ, భాష రాదనే కారణంతో లైసెన్స్‌లు రద్దు చేయడం అమానుషమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ (Harshavardhan Sapkal) ఆరోపించారు. ఇది రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విభజన తీసుకురావడమేనని విమర్శించారు. వేలాది మంది వలస కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇలాంటి నిబంధనలు వారి పొట్ట కొట్టడమేనని డ్రైవర్ యూనియన్ నేత శశాంక్ రావు (Shashank Rao) మండిపడ్డారు. శిక్షలు వేయడానికి బదులు భాషా శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. అయితే, మే 1 గడువు సమీపిస్తున్న తరుణంలో, ముంబై వంటి కాస్మోపాలిటన్ నగరంలో ఈ నిబంధన ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని సర్వత్రా టెన్షన్ నెలకొంది.

Next Story