RBI:త్వరలో కొత్త రూ.20 నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-18 13:27:40  IST  )

ఆర్బీఐ(RBI) మరోసారి కీలక ప్రకటన చేసింది.

RBI:త్వరలో కొత్త రూ.20 నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన!
X

దిశ,వెబ్‌డెస్ఖ్: ఆర్బీఐ(RBI) మరోసారి కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త రూ.20 నోట్లు రానున్నాయి. అయితే గతంలో (2016) పెద్ద నోట్ల రద్దు, రూ.2000 కరెన్సీ నోట్లు తీసుకురావడం, మళ్లీ వాటిని ఉపసంహరించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు కొత్త నోట్లపై ప్రకటన వచ్చిన ప్రజల్లో కాస్త ఆందోళన కలుగుతుంది. పాత నోట్లను రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని రూ.20 బ్యాంక్ నోట్లకు చట్టబద్ధత ఉంటుందని చెప్పింది. పాత నోట్లు రద్దు కావని, యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

త్వరలో కొత్త రూ.20 నోట్లు..

మహాత్మ గాంధీ సిరీస్‌లో ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) సంతకంతో కొత్త రూ.20 నోట్లు ముద్రిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కొత్త నోట్ల డిజైన్, ఫీచర్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని తెలిపింది. ఎలాంటి మార్పుండదు అని పేర్కొంది. నోట్ల రంగు, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుక వైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం అన్నీ అలాగే ఉంటాయి. కేవలం గవర్నర్ సంతకం మాత్రమే మారుతుంది. ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త నోట్లు ముద్రిస్తారు.

Next Story