నీట్ యూజీ పేపర్ లీక్ కేసు: మరో ఇద్దరి అరెస్ట్, మొత్తం 13కు చేరిన నిందితుల సంఖ్య

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ వేగం పెంచింది.

నీట్ యూజీ పేపర్ లీక్ కేసు: మరో ఇద్దరి అరెస్ట్, మొత్తం 13కు చేరిన నిందితుల సంఖ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET-UG) 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) వేగం పెంచింది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు కీలక నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 13కు చేరింది. లాతూరుకు చెందిన డాక్టర్ మనోజ్ షిరూర్ కోచింగ్ సెంటర్ యజమాని కుమారుడితో సహా ముగ్గురు విద్యార్థులకు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాన్ని చేరవేసినట్లు సమాచారం. ఈ కేసులో మరో నిందితుడైన పి.వి. కులకర్ణి ద్వారా ఇతనికి ప్రశ్నలు అందినట్లు దర్యాప్తులో తేలింది. పుణెలోని ప్రముఖ ‘డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ (APMA)’లో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న తేజస్ హర్షద్‌కుమార్ షా.. ఇప్పటికే కస్టడీలో ఉన్న మనీషా హవల్దార్ అనే మహిళ నుంచి ఫిజిక్స్ ప్రశ్నపత్రాన్ని పొందినట్లు సీబీఐ గుర్తించింది.

దేశవ్యాప్తంగా ముమ్మర సోదాలు..

కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు మేరకు మే 12, 2026న కేసు నమోదు చేసిన సీబీఐ.. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగింది. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, లాతూర్, అహిల్యానగర్ సహా దేశవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షకు ముందే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయనే మూలాలను గుర్తించామని, డిజిటల్ ఆధారాల ఫోరెన్సిక్ విశ్లేషణతో పాటు ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు విచారణను మరింత తీవ్రం చేశామని సీబీఐ అధికారులు వెల్లడించారు.

Next Story