కోటి ఉద్యోగాలు.. కోటి మంది లక్షాధికారులు.. ఎన్డీయే మేనిఫెస్టో హామీలు!

by Phanindra |

కోటి ఉద్యోగాలిస్తామని, కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని హామీలిస్తూ ఎన్డీయే మేనిఫెస్టో విడుదల చేసింది.

కోటి ఉద్యోగాలు.. కోటి మంది లక్షాధికారులు.. ఎన్డీయే మేనిఫెస్టో హామీలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ తొలి దశ పోలింగ్ దగ్గర పడుతున్న వేళ అధికార ఎన్డీయే కూటమి తమ మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమిలోని సీనియర్ నేతల ఆధ్వర్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సీఎం నితీశ్ కుమార్ కలిసి ‘సంకల్ప్ పత్ర’ మేనిఫెస్టోను విడుదల చేశారు. కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తామని, కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ఈ మేనిఫెస్టోలో ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. అలాగే బిహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్ వేలను వేస్తామని, 50 లక్షల పక్కా గృహాలు నిర్మించడంతోపాటు ప్రజలకు ఉచిత రేషన్, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, పీఎం ఆవాస్ యోజన కింద సామాజిక భద్రత పెన్షన్ అందిస్తామని ఎన్డీయే ప్రకటించింది. ప్రతియేటా పనుల కోసం వలసలు వెళ్లే బిహార్‌లో తాము అధికారంలోకి రాగానే నైపుణ్య లెక్కలు తీసి, స్కిల్స్ ఆధారంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ప్రతిజిల్లాలో స్కిల్ సెంటర్లు ప్రారంభించి, బిహార్‌తో అంతర్జాతీయ స్కిల్ సెంటర్‌గా మారుస్తామని తెలిపింది. మహిళలకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించి, వారిని లక్షాధికారులుగా మార్చేందుకు కృషి చేస్తామంది. అక్కడితో ఆగకుండా మిషన్ కరోడ్‌పతి ద్వారా వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తామని తెలిపింది.

భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలు..

బిహార్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కూడా భారీగా మార్పులు తెస్తామని, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు వేయడంతోపాటు 3,600 కిలోమీటర్ల రైల్ ట్రాక్స్ వేస్తామని హామీ ఇచ్చింది. పట్నా, దర్బంగా, పూర్ణియా, భల్‌పూర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో నెట్‌వర్క్‌లు నిర్మిస్తామని తెలిపింది. మరో పది పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామంది. ప్రతి జిల్లాలో పది కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీలు నిర్మిస్తామని వెల్లడించింది. తాము అధికారంలోకి వస్తే 100 ఎంఎస్ఎంఈ పార్కులతోపాటు 50 వేలకుపైగా కాటేజ్ సంస్థలను ఏర్పాటు చేస్తామని మాటిచ్చింది. డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ మానుఫాక్చరింగ్ పార్క్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వంటివి కూడా ఏర్పాటు చేస్తామంది. వీటితోపాటు ప్రతిజిల్లాలో ప్రపంచ స్థాయి మెడిసిటీ, మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని తెలిపింది. దక్షిణాసియాలో టెక్స్‌టైల్, సిల్క్ హబ్‌గా బిహార్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించింది.

Next Story