నింగిలోకి దూసుకెళ్లిన నాసా ‘ఆర్టెమిస్-II’ రాకెట్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-02 02:44:36  IST  )

నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్-II మిషన్ ప్రారంభమైంది. 322 అడుగుల రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి వైపు పయనమయ్యారు.

నింగిలోకి దూసుకెళ్లిన నాసా ‘ఆర్టెమిస్-II’ రాకెట్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) మరో మైలురాయిని అధిగమించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తిరిగి చంద్రుడిపైకి మానవుడిని పంపే లక్ష్యంతో చేపట్టిన ‘ఆర్టెమిస్-II’ (Artemis II) మిషన్ విజయవంతంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి 322 అడుగుల భారీ SLS (Space Launch System) రాకెట్ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మిషన్‌లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు చంద్రుడి దిశగా ప్రయాణిస్తున్నారు. వారిలో చంద్రుడి వైపు వెళ్తున్న మొదటి మహిళగా క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. విక్టర్ గ్లోవర్, వీరితో పాటు కమాండర్ రీడ్ వైజ్‌మాన్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఈ బృందంలో ఉన్నారు.

మిషన్ ప్రధాన లక్ష్యం ఇదే..

ఈ మిషన్ సుమారు 10 రోజుల పాటు కొనసాగుతుంది. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై దిగరు కానీ, చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఓరియన్ (Orion) వ్యోమనౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షించడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. ఒకవేళ ఆర్టెమిస్-II విజయవంతం అయితే, తర్వాత దశలో ఆర్టెమిస్-III ద్వారా 2028లో మానవులను నేరుగా చంద్రుడిపైకి దింపాలని నాసా ప్రణాళికలు రచిస్తోంది. ‘మనం తిరిగి చంద్రుడిపైకి వెళ్తున్నాం.. ఈసారి అక్కడే నివసించేందుకు, కొత్త విషయాలను నేర్చుకునేందుకు వెళ్తున్నాం’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Next Story