కర్ణాటకలో మ‌రో వివాదం.. టెంపుల్స్‌ జాతర్ల‌లో ముస్లింల‌ దుకాణాలు నిషేధం!

by Disha Web Desk 20 |
కర్ణాటకలో మ‌రో వివాదం.. టెంపుల్స్‌ జాతర్ల‌లో ముస్లింల‌ దుకాణాలు నిషేధం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మ‌న్న రాజ్యాంగ స్ఫూర్తిని తుంగ‌లో తొక్కుతూ కొన్ని సంవ‌త్స‌రాలుగా భార‌త‌దేశంలో మ‌త విధ్వేషాలు పెరిగిపోతున్నాయి. ఒక‌ప్పుడు కొన్ని ప్రాంత‌ల‌కే ప‌రిమిత‌మైన ఈ మ‌త వివ‌క్ష ఇప్పుడు దేశ‌మంతా విస్త‌రిస్తూ రాజ్య‌మేలుతోంది. ఇందులో భాగంగానే తాజాగా కర్ణాటక కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఆలయ అధికారులు ఓ తీవ్ర నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయా హిందూ దేవాల‌యాల వార్షిక ఉత్సవాల్లో ముస్లిం వ్యాపారులు స్టాల్స్ ఉండ‌కుండా నిషేధం విధించారు.

ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి విద్యాలయాల‌కు రాకూడ‌దంటూ పెట్టిన‌ ఆంక్ష‌లపై ఇంకా తీవ్ర‌మైన ఉద్య‌మం కొన‌సాగుతూనే ఉంది. ఈ త‌రుణంలో తాజా ప‌రిణామం మ‌రింత ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న ఈ జాతర్ల‌లో అనేక సంవత్సరాలుగా ముస్లింలు స్టాల్స్ నడుపుతుండ‌గా ఈ హ‌టాత్ప‌రిణామంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్‌లపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఇటీవ‌ల చాలా మంది ముస్లింలు తమ దుకాణాలను మూసివేశారు. హిందూ దేవాల‌యాల వ‌ద్ద ఉన్న ముస్లిం దుకాణదారులు కూడా ఇందులో పాల్గొన్నారు ఈ నేప‌ధ్యంలో క‌ర్నాట‌క‌ హిందూత్వ సంస్థలు ఈ నిర‌స‌న‌లో వ్యాపారుల భాగస్వామ్యం ఉండ‌టంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఈ నేప‌ధ్యంలో మంగ‌ళ, బుధ‌వారాలు న‌డిచే మంగళూరు జిల్లాలోని కౌప్ పట్టణంలోని హోసా మరిగుడి దేవాలయం వార్షిక జాతరలో స్టాల్స్‌ వేలం వేయగా ముస్లింలకు స్టాల్స్‌ను కేటాయించలేదు. హిజాబ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించని ముస్లింలకు స్టాళ్లు ఇవ్వవద్దని హిందూ సంస్థలు తమకు విజ్ఞప్తి చేశాయని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు రమేష్ హెగ్డే తెలిపారు. రెండు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రజలు ఈ ఉత్సవాన్ని సందర్శిస్తారని, శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయన చెప్పారు. ఇక‌, కొల్లూరు మూకాంబిక ఆలయ జాతరకు హిందూయేతర వ్యాపారులను అనుమతించవద్దని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఉడిపి జిల్లాలోని కొల్లూరు గ్రామ పంచాయతీకి కూడా విజ్ఞప్తి చేసినట్లు స‌మాచారం. అలాగే, దక్షిణ కన్నడ జిల్లాలో బప్పండు దుర్గాపరమేశ్వరి ఆలయం, మంగళాదేవి ఆలయం, పుత్తూరు మహాలింగేశ్వరాలయం ముందు హిందూయేతరులు జాతరలో స్టాళ్లు పెట్టరాదని బ్యానర్లు వేశారు. "రాజ్యాంగ విరుద్ధమైన వారికి, పశువులను చంపేవారికి అనుమతి లేదు" అని ఒక బ్యానర్ ఉండ‌టం విశేషం. అయితే, ఈ బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నామని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. "సివిక్ ఏజెన్సీ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంటే, సంబంధిత అధికారుల్ని సంప్రదించి తదనుగుణంగా చర్య తీసుకుంటాము" అని క‌మిష‌న‌ర్‌ చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా, ముస్లిం వ్యాపారులను ఇంతకు ముందు ఎన్న‌డూ నిషేధించలేదని జిల్లా వీధి వ్యాపారుల సంఘం కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ పేర్కొన్నారు. సుమారు 700 మంది నమోదిత సభ్యులు ఉండ‌గా, వారిలో 450 మంది ముస్లింలు ఉన్నార‌ని, కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లుగా ఎలాంటి వ్యాపారం లేక‌పోవ‌డం, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు స‌ద్దుమ‌ణుగుతున్నాయ‌ని అనుకుంటే మమ్మల్ని ఆలయ కమిటీలు వెలివేయ‌డం త‌గ‌ద‌ని ముస్లిం వ్యాపారస్థులు వాపోతున్నారు.

Next Story

Most Viewed