నా కొడుకు వీర్యాన్ని అప్పగించండి : బాంబే హైకోర్టుకు తల్లి విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |

ఓ తల్లి తన మరణించిన కుమారుడి వీర్యాన్ని నాశనం చేయకుండా తమకు అప్పగించాలంటూ బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించారు.

నా కొడుకు వీర్యాన్ని అప్పగించండి : బాంబే హైకోర్టుకు తల్లి విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ తల్లి తన మరణించిన కుమారుడి వీర్యాన్ని నాశనం చేయకుండా తమకు అప్పగించాలంటూ బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించారు. పెళ్లి కాకుండానే క్యాన్సర్‌తో కుమారుడు మృతిచెందాడని, కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు అతడి వీర్యాన్ని తమకు అప్పగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. కుమారుడు తన మరణానంతరం వీర్యాన్ని నాశనం చేయాలని సంతాన సాఫల్య కేంద్రంలో సమ్మతి పత్రంపై సంతకం చేశారని పేర్కొన్న తల్లి, తాము ఇందుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాదించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ మనీష్ పటేల్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. తుది తీర్పు వచ్చేంతవరకూ వీర్యాన్ని భద్రంగా ఉంచాలని IVF కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.

కుమారుడికి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత.. చికిత్స ప్రారంభించే ముందు ముంబయిలోని IVF సెంటర్‌లో ఆంకాలజిస్ట్ సిఫార్సు మేరకు వీర్యాన్ని నిల్వ చేశారు. కీమోథెరపీ తర్వాత ఆయన కోలుకుని వస్తారని ఆశపడిన కుటుంబానికి, ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆయన మరణంతో తీవ్ర విషాదం మిగిలింది. అతడి వారసత్వాన్ని కాపాడుకునేందుకు మృతుని తల్లి, అతడి వీర్యాన్ని గుజరాత్‌లోని మరో IVF సెంటర్‌కు తరలించాలని కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. IVF కేంద్రం తిరస్కరించడంతో, హైకోర్టును ఆశ్రయించారు.

Next Story