బిక్షాటనకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఆకలితో అల్లాడి నెల రోజుల పసికందు మృతి!

by Ramesh Naini |

ఉపాధి లేక యాచనకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న నెల రోజుల పసికందు ఆకలి, అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది.

బిక్షాటనకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఆకలితో అల్లాడి నెల రోజుల పసికందు మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఉపాధి లేక యాచనకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న నెల రోజుల పసికందు ఆకలి, అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. బరేలీలోని ఖిలా కంటోన్మెంట్ ప్రాంతంలో నివసించే మహ్మద్ షాదాబ్.. కరోనా సమయంలో గాలి పటాల దారం (మాంజా) తయారీ పనిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఉపాధి దొరకకపోవడంతో భార్య హీనాతో కలిసి బిక్షాటన చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో దంపతులిద్దరూ తమ ముగ్గురు పిల్లలను (నెల రోజుల పాప, ఏడాదిన్నర, నాలుగేళ్ల పిల్లలు) ఇంట్లోనే వదిలేసి యాచనకు వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చేసరికి నెలల చిన్నారి విగతజీవిగా కనిపించింది.

గతంలోనూ మరో బిడ్డ మృతి..

పాప మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనారోగ్యం, ఇన్‌ఫెక్షన్ కారణంగానే పాప చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని ఖిలా ఎస్ హెచ్ ఓ సుభాష్ కుమార్ వెల్లడించారు. అయితే, తీవ్రమైన ఆకలి వల్లే చిన్నారి చనిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత అద్దె చెల్లించలేక షాదాబ్ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయిందని, ప్రస్తుతం వారి ఆచూకీ ఎవరికీ తెలియదని ఇరుగుపొరుగు వారు తెలిపారు. గతంలోనూ ఇదే తరహా దీన పరిస్థితుల్లో ఆ దంపతుల ఆరు నెలల మరో బిడ్డ కూడా మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story