మనీలాండరింగ్ కేసు.. రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-15 10:19:05  IST  )

మనీలాండరింగ్ కేసులో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

మనీలాండరింగ్ కేసు.. రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఇవాళ ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నోటీసుల జారీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే, హర్యానాలోని గుర్గావ్- షికోపూర్ భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ సుదీర్ఘ కాలంగా దర్యాప్తు చేస్తోంది. 2008లో గుర్గావ్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈ దర్యాప్తు మొదలైంది. వాద్రాకు చెందిన కంపెనీ తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి, ఆ తర్వాత భారీ లాభానికి విక్రయించిందని, ఈ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో గతంలోనే ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయగా, దానిపై విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. వాద్రా సహా మరో 11 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలను రాబర్ట్ వాద్రా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్య అని, రాజకీయ లబ్ధి కోసమే తనను వేధిస్తున్నారని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కూడా ఆయనపై దర్యాప్తు జరుగుతోంది.

Next Story