మోడీ వ్యాఖ్యలు నిరుత్సాహపరిచాయి: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్

by Dishanational2 |
మోడీ వ్యాఖ్యలు నిరుత్సాహపరిచాయి: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదనంతా ముస్లింలకు పంచుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. మోడీ మాటలు పూర్తిగా నిరుత్సాహపరిచాయని తెలిపారు. అత్యంత సీనియర్ నాయకుడు ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని మోడీకి భయం పట్టుకుందని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమైందని ఇప్పటికే మోడీకి అర్థమైందని, అందుకే అర్థ రహితమైన మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎక్కువ సంఖ్యలో పిల్లలు కలిగి ఉన్న వ్యక్తులు ప్రచార సమస్యగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వ పనితీరుపై మోడీ ఎందుకు చర్చించడం లేదని మండిపడ్డారు. తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే ప్రణాళికలు సైతం బీజేపీ దగ్గర లేవని స్పష్టం చేశారు. కాగా, రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ..ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు, విలువైన వస్తువలును చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed