నేటితో మెస్సీ భారత పర్యటన ముగింపు.. ఢిల్లీలో ప్రధానితో భేటీ, ఎగ్జిబిషన్ మ్యాచ్

by Malleboina Mahesh |

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ "గోట్ టూర్" లో భాగంగా జరుగుతున్న భారత పర్యటన నేటితో ముగియనుంది. తన పర్యటనలో భాగంగా, మెస్సీ ఈ రోజు ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

నేటితో మెస్సీ భారత పర్యటన ముగింపు.. ఢిల్లీలో ప్రధానితో భేటీ, ఎగ్జిబిషన్ మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) "గోట్ టూర్" లో భాగంగా జరుగుతున్న భారత పర్యటన నేటితో ముగియనుంది. తన పర్యటనలో భాగంగా, మెస్సీ ఈ రోజు ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. తొలుత, ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో అభిమానులు, ప్రముఖులతో సమావేశమవుతారు. అనంతరం, దేశ రాజధానిలో అత్యంత ముఖ్యమైన భేటీ జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi)తో మెస్సీ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఈ పర్యటన దేశంలో ఫుట్‌బాల్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది.

ప్రధానితో భేటీ తర్వాత, మెస్సీ జాతీయ ఫుట్‌బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ (Praful Patel) నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వంటి దేశంలోని పలువురు ఉన్నత ప్రముఖులను కలుస్తారు. క్రీడాభిమానులకు అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సాయంత్రం 3:30 గంటలకు ఫిరోజ్ షా కోట్లా స్టేడియం (అరుణ్ జైట్లీ స్టేడియం)లో మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో సినీ, క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొని మెస్సీతో కలిసి ఆడనున్నారు. ఈ రోజు రాత్రికి మెస్సీ భారత్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.

Next Story