- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. 30ఏళ్లలో తొలిసారి.. ‘టెర్రర్ ఫ్రీ మంత్’గా మే
30 సంవత్సరాల్లో తొలిసారి మే నెల టెర్రర్ ఫ్రీ మంత్ గా నిలిచింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్డెస్క్: 30 ఏళ్లలో తొలిసారి జమ్మూ కశ్మీర్ లో మే నెలలో ఒక్క ఉగ్రవాది హత్యగాని, దాడి గాని జరగలేదని అధికారులు గుర్తించారు. టెర్రర్ ఫ్రీ మంత్ ఆఫ్ 2026గా మే నెలను ప్రకటించారు. దీంతో జమ్మూకశ్మీర్ ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. లోయలో ఉగ్రవాదం తీవ్రరూపం దాల్చిన గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా.. 2026 మే నెలలో ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద సంబంధిత మరణం కూడా నమోదు కాలేదు. గడిచిన 30 ఏళ్ల పైచిలుకు కాలంలో పూర్తిగా ఒక నెల ఎలాంటి ప్రాణనష్టం లేకుండా గడవడం ఇదే తొలిసారి కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఏడాది (2026) మొదటి ఐదు నెలల అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. కాశ్మీర్లో ఉగ్రవాదానికి సంబంధించిన మరణాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ఇందులో తొమ్మిది మంది ఉగ్రవాదులు, ఒక భద్రతా సిబ్బంది, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏమిటంటే.. ఈ ఐదు నెలల్లో ఒక్క సామాన్య పౌరుడు (Civilian) కూడా ప్రాణాలు కోల్పోలేదు.
గతాన్ని తిరగేస్తే.. నెత్తురోడిన మే నెల..
జమ్మూ కాశ్మీర్ పోలీసుల అధికారిక డేటా ప్రకారం.. ఒకప్పుడు మే నెల అంటేనే మరణాల హోరుగా ఉండేది. మే 2000 నాటికి ఒకే నెలలో 288 మంది బలయ్యారు. ఇక ఉగ్రవాదం గరిష్ట స్థాయికి చేరిన 2001 మే నెలలో ఏకంగా 300 మంది మరణించారు. ఆ సమయంలో నిత్యం పౌరులు, ఉగ్రవాదులు, సైనికులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండేవారు. ఆ తర్వాత మే నెల మరణాల సంఖ్య 2002లో 288, 2005లో 188, 2010లో 43, 2015లో 16గా నమోదవుతూ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2016 నాటి అశాంతి తర్వాత మళ్లీ కొద్దిగా పెరిగినప్పటికీ (2022 మే నెలలో 38 మరణాలు), గత ఏడాది 2025 మేలో 43 మంది చనిపోగా.. ఈ ఏడాది మాత్రం ఒక్కరు కూడా ఎన్కౌంటర్ కు గానీ.. హత్యకు గానీ గురికాకుండా ఉండటం విశేషంగా నిలిచింది.
వార్షిక గణాంకాల్లో భారీ మార్పు..
కాశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్వర్క్ ఎంతలా బలహీనపడిందో చెప్పడానికి వార్షిక మరణాల గణాంకాలే నిదర్శనం. 2001లో మొత్తం 4,011 మంది చనిపోయారు. ఇందులో 1,024 మంది పౌరులు, 628 మంది భద్రతా సిబ్బంది, 2,345 మంది ఉగ్రవాదులు ఉన్నారు. 2006లో ఈ సంఖ్య 1,125కి, 2012 నాటికి 121కి తగ్గింది. మళ్లీ 2018లో స్థానిక రిక్రూట్మెంట్ పెరగడంతో 452 మరణాలు నమోదయ్యాయి. 2019 తర్వాత తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల మరణాలు క్రమంగా తగ్గుతూ.. 2023లో 134, 2024లో 127, 2025 ముగిసే సమయానికి 121కి చేరాయి. 2026 మొదటి ఐదు నెలలు మాత్రం చరిత్రలోనే అత్యంత తక్కువ మరణాలు నమోదైన కాలంగా నిలిచింది. నిరంతరాయంగా సాగుతున్న కౌంటర్-ఇన్సర్జెన్సీ ఆపరేషన్లు, నిఘా వర్గాల (Intelligence) మధ్య పటిష్టమైన సమన్వయం, స్థానిక యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యే రేటు చారిత్రాత్మక స్థాయికి పడిపోవడమే ఈ శాంతికి ప్రధాన కారణాలని భద్రతా విభాగాల సీనియర్ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు పూర్తిగా క్షీణించిందని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
అయితే.. ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ఉగ్రవాదాన్ని మళ్లీ పురికొల్పేందుకు సరిహద్దు అవతలి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఆర్మీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మే నెలలో మరణాలు లేనప్పటికీ, అనుమానాస్పద ప్రాంతాల్లో ఇప్పటికీ కార్డన్ అండ్ సెర్చ్ (తనిఖీలు) ఆపరేషన్లు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.






