పూరీ జగన్నాథుడి రథయాత్రలో పలువురికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

by Jakkula.Mamatha |

ఒడిశా(Odisha)లోని పూరిలో జగన్నాథుని రథయాత్ర నిన్న(శుక్రవారం) ప్రారంభమైన విషయం తెలిసిందే.

పూరీ జగన్నాథుడి రథయాత్రలో పలువురికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ,వెబ్‌డెస్క్: ఒడిశా(Odisha)లోని పూరిలో జగన్నాథుని రథయాత్ర నిన్న(శుక్రవారం) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకు సాగనుంది. జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు జరగునుంది. దీంతో మొదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ తరుణంలో పూరీ క్షేత్రంలో నిన్న జరిగిన వార్షిక రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. భక్తుల అస్వస్థత పై పూరీ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్(Chief District Medical Officer) డాక్టర్ కిషోర్ శతపతి(Dr. Kishore Shatapati) మీడియాతో మాట్లాడుతూ.. కీలక విషయాలు వెల్లడించారు.

యాత్రలో పాల్గొన్న భక్తులు తీవ్రమైన ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా ఇబ్బంది పడ్డారు. ఈ తరుణంలోనే చాలామంది వాంతులు, కళ్లు తిరిగి పడిపోవడం, చిన్నపాటి గాయాలు అయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో భక్తుల(Devotees) పరిస్థితి చూసిన వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో చాలామంది ప్రాథమిక చికిత్సతో కోలుకున్నారు. కానీ, దాదాపు 70 మంది భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో అధికారులు ఎప్పటికప్పుడు భక్తులు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ రథయాత్రలో పలువురు అస్వస్థతకు గురైనట్లు వచ్చిన వార్తలపై ఒడిశా మంత్రి ముఖేష్ మహాలింగ్ మాట్లాడుతూ.. అధిక తేమ కారణంగా, ఒకరు లేదా ఇద్దరు భక్తులు కుప్పకూలిపోయారు. రెస్క్యూ బృందాలు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాయి. ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. గ్లూకోజ్ మరియు నీరు తగినంతగా అందించబడుతున్నాయని తెలిపారు. అవసరమైన వారికి సరైన ఆరోగ్య సంరక్షణ అందించబడుతుంది. ఆ వార్తలను నిర్ధారించుకోవడానికి నేను ఆసుపత్రిని కూడా సందర్శిస్తానని ఆయన తెలిపారు.

Next Story