మేం ఓడిపోలేదు.. బీజేపీ కుట్రతోనే ఫలితాలు తారుమారు: సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేం ఓడిపోలేదు.. బీజేపీ కుట్రతోనే ఫలితాలు తారుమారు: సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, కేంద్ర ఎన్నికల సంఘం (CEC), బీజేపీ కుమ్మక్కై ఫలితాలను తారుమారు చేశాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ తీరుపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఎన్నికల ప్రధాన అధికారి (CEC) జ్ఞానేష్‌కుమార్‌పై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "బెంగాల్ ఎన్నికల్లో జ్ఞానేష్‌కుమార్ ఒక విలన్‌లా వ్యవహరించారు. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా ఆయన చక్రం తిప్పారు. సుమారు 100 సీట్లను అడ్డదారిలో బీజేపీకి దోచిపెట్టారు" అని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

90 లక్షల ఓట్ల చోరీ..?

ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో భారీ కుంభకోణం జరిగిందని మమత పేర్కొన్నారు. "SIR పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన 'ఓట్ల చోరీ'. బీజేపీ చేసిన ఈ అన్యాయంపై మేము న్యాయపోరాటం చేస్తాం. ప్రజల తీర్పును అపహాస్యం చేసిన వారిని వదిలిపెట్టం" అని ఆమె హెచ్చరించారు. అనంతరం జాతీయ రాజకీయాలపై కూడా మమత స్పష్టత ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని ఆమె వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ 'ఇండి' కూటమిలోనే ఉందని, భవిష్యత్తులో ఈ కూటమిని మరింత బలోపేతం చేస్తామని ఆమె ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తాము చురుకైన పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఓటమిని తాము అంగీకరించడం లేదని, ఇది ప్రజా తీర్పు కాదని.. కేవలం సాంకేతిక, వ్యవస్థల మేనేజ్‌మెంట్ ద్వారా వచ్చిన ఫలితాలని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.

Next Story