బీజేపీ మహిళా వ్యతిరేకి.. సీతమ్మ గురించి మాట్లాడట్లేదు : మమత

by Dishanational4 |
బీజేపీ మహిళా వ్యతిరేకి.. సీతమ్మ గురించి మాట్లాడట్లేదు : మమత
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైరయ్యారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని ఆరోపించారు. అందుకే బీజేపీ నేతలు రాముడి గురించే మాట్లాడతారని.. సీతమ్మ మాట కూడా ఎత్తరని విమర్శించారు. ‘‘మేం దుర్గామాత ఆరాధకులం. బీజేపీ వాళ్లు మాకు మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు’’ అని వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం కోల్‌కతాలో మమతా బెనర్జీ మత సామరస్య ర్యాలీ నిర్వహించారు. అన్ని మతాలకు చెందిన వారితో కలిసి సత్యాగ్రహ మార్చ్‌ చేపట్టారు. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమం బీజేపీ రాజకీయ జిమ్మిక్కు అని మమత ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మతాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాముడిని పూజించే వారిపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా’’ అని ఆమె చెప్పారు. కాళీఘాట్‌లోని కాళీమాత ఆలయంలో పూజ తర్వాత ఈ ర్యాలీని దీదీ ప్రారంభించారు. మార్గంమధ్యలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను ఆమె సందర్శించారు.


Next Story

Most Viewed