ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధం.. 226కు పైగా సీట్లు గెలుస్తాం: మమతా బెనర్జీ ధీమా

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధం.. 226కు పైగా సీట్లు గెలుస్తాం: మమతా బెనర్జీ ధీమా
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు. ఈ సర్వేలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, తమ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. ఒక వీడియో సందేశం ద్వారా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను ప్రసారం చేయడానికి బీజేపీ కొంతమంది మీడియా ప్రతినిధులకు భారీగా డబ్బులు చెల్లించిందని సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, టీఎంసీ ఒంటరిగానే 226 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అమిత్ షా కనుసన్నల్లో కేంద్ర బలగాలు..

ఎన్నికల సమయంలో మోహరించిన కేంద్ర బలగాలపై కూడా ఆమె మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్ష ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు "బీజేపీ ఏజెంట్లుగా" పనిచేశాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ, ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు కష్టపడిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఫలితాల రోజున అసలు నిజం బయటపడుతుందని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో దీదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story