దీదీ నాకు క్లోజ్.. పర్వాలేదోయ్ అంటున్న రాహుల్.. ఎందుకు?

by Dishanational4 |
దీదీ నాకు క్లోజ్.. పర్వాలేదోయ్ అంటున్న రాహుల్.. ఎందుకు?
X

దిశ, నేషనల్ బ్యూరో : బెంగాల్‌లో ఓ వైపు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ‘పర్వాలేదు’ అని కూల్‌గా చెప్పేశారు. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాకు చాలా సన్నిహితురాలు. సీట్ల పంపకాలను ఉద్దేశించి దీదీపై మా పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి చేసిన పదునైన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లోనూ మమతా బెనర్జీ పార్టీ పోటీ చేయబోతోందని గత వారం మీడియాలో వచ్చిన కథనాలపై అధిర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మమత అవకాశవాది. ఆమెతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోం. సొంత బలంతో ఎలా పోరాడాలో కాంగ్రెస్‌కు బాగా తెలుసు. మేం కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. కాంగ్రెస్ మద్దతుతోనే బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని దీదీ గుర్తుంచుకోవాలి’’ అని అధిర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘పర్వాలేదు.. దీదీ నాకు క్లోజ్’ అని బదులిచ్చారు.


Next Story

Most Viewed