- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటరే 'అనుమానితుడు' అయితే ఎలా?.. ఎన్నికల కమిషన్కు ఎంఏ బేబీ ఘాటు లేఖ!
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) పేరుతో లక్షలాది మంది ఓటర్లను తొలగించడంపై సీపీఐఎం (CPI-M) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) పేరుతో లక్షలాది మంది ఓటర్లను తొలగించడంపై సీపీఐఎం (CPI-M) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ ఓట్ల తొలగింపును రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత సుమారు 90 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారని బేబీ తన లేఖలో పేర్కొన్నారు. ఇది రాష్ట్ర మొత్తం ఓటర్లలో దాదాపు 12 శాతం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఓటర్లను "అండర్ అడ్జుడికేషన్" (పరిశీలనలో ఉన్న వారు) అనే అస్పష్టమైన కేటగిరీలో ఉంచి, చివరకు వారికి ఓటు హక్కు లేకుండా చేశారని ఆరోపించారు.
అల్గారిథమ్ ఆధారిత తొలగింపులు..
క్షేత్రస్థాయిలో పారదర్శకమైన వెరిఫికేషన్ చేయకుండా, కేవలం సాఫ్ట్వేర్ అల్గారిథమ్లు మరియు అహేతుకమైన నిబంధనల ఆధారంగా ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరును ఒక 'అనుమానితుడిగా' చూస్తున్నారని, తన ఓటు హక్కును నిరూపించుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే వేయడం దారుణమని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త ప్రక్రియ వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యారని, కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయని లేఖలో ప్రస్తావించారు. ముస్లింలు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారని స్వతంత్ర విశ్లేషణలు చెబుతున్నాయని ఆయన ఆరోపించారు. "ఓటు హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం పౌరులకు లభించిన ప్రాథమిక హక్కు. ఇంత పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం రాజ్యాంగంపై జరుగుతున్న దాడి" అని ఎం.ఏ. బేబీ పేర్కొన్నారు. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.






