ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది.. ట్రాక్ రికార్డు భళా

by Dishanational4 |
ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది.. ట్రాక్ రికార్డు భళా
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఫిబ్రవరి 15న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈయన కశ్మీర్‌లోని ఉధంపూర్‌ కేంద్రంగా పనిచేసే నార్తర్న్ కమాండ్‌కు కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలందించారు. 2020 మేలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసీ) వెంట భారత్, చైనాల నడుమ సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరిలో నార్తర్న్ కమాండ్‌ పగ్గాలను ఉపేంద్ర ద్వివేది చేపట్టారు. లడఖ్ సెక్టార్‌ పరిధిలో ఎల్ఏసీ వెంట పరిస్థితిని చక్కదిద్దడంలో, సున్నితమైన ఈ ప్రాంతంలో చైనాతో అలజడులు తీవ్రరూపు దాల్చకుండా నిరోధించడంలో ఉపేంద్ర ద్వివేది పాత్ర ఉందని అంటారు. సరిహద్దు వివాదంపై భారత్, చైనా మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉపేంద్ర ద్వివేదిని కీలకమైన ఆర్మీ వైస్ చీఫ్ పదవికి ప్రమోట్ చేయడం గమనార్హం. 2024 మే 31న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయనున్నారు. తదుపరిగా ఆ అత్యున్నత పదవికి పోటీపడుతున్న వారిలో ఉపేంద్ర ద్వివేది పేరు కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈయన మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఉన్న సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, ఇండియన్ మిలిటరీ అకాడమీలలో చేరారు. ఇక ఉధంపూర్‌‌లోని నార్తర్న్ కమాండ్‌కు కమాండింగ్-ఇన్-చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ వచ్చేవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Next Story

Most Viewed