ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు

by Dishanational5 |
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ లెస్బియన్ జంట.. యూపీలోని దేవారియా జిల్లాలోని ఓ ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. దీంతో ప్రేమకు కులం, మతంతోపాటు లింగ భేదమూ లేదని వీరు నిరూపించారు. వివరాల్లోకెళ్తే, 28ఏళ్ల జయశ్రీ రాహుల్, 23ఏళ్ల రాఖి దాస్‌లది బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా. యూపీలోని ఓ ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టింది. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ లెస్బియన్ జంట.. కొన్ని రోజుల కిందట దేవారియాలోని దిర్గేశ్వర్‌నాథ్ ఆలయంలోకి వెళ్లింది. అయితే, అక్కడ పెళ్లి చేసుకుంనేదుకు పూజారి నిరాకరించారు. పై అధికారుల నుంచి అనుమతి లేదని చెప్పి అక్కడి నుంచి పంపించారు. అయినప్పటికీ నిరుత్సాహపడని వీరి జంట.. తెలిసినవారితో కలిసి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించింది. చివరగా, వీరి వివాహం కోసం నోటరీ అఫిడవిట్ పొందారు. దాన్ని తీసుకుని అదే జిల్లాలోని భగద భవానీ ఆలయానికి వెళ్లి అక్కడి పూజారి సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. అనంతరం పెళ్లి ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసి, వారి ప్రేమకథను చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.



Next Story