Supreme Court: భాష ఒక సంస్కృతి.. నాగరికత పురోగతి కొలిచే కొలమానం

by Shamantha N |
Supreme Court: భాష ఒక సంస్కృతి.. నాగరికత పురోగతి కొలిచే కొలమానం
X

దిశ, నేషనల్ బ్యూరో: “భాష ఒక సంస్కృతి.. సమాజం, ప్రజల నాగరికత పురోగతిని కొలిచే కొలమానం” అని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. నేమ్‌ బోర్డుల్లో ఉర్దూను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్ ను జస్టిస్‌ సుధాంశ్‌ ధులియా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భాష ఒక సమాజానికి, ఒక ప్రాంతానికి, ప్రజలకు చెందినది. ఒక మతానికి సంబంధించినది కాదు. భాష అనేది ఒక సంస్కృతి. సమాజం, ప్రజల నాగరికత పురోగతిని కొలవడానికి ఇది ఒక కొలమానం. ఉర్దూ విషయంలో కూడా అంతే’’ అని కోర్టు స్పష్టం చేసింది. స్థానికులు చాలా మంది ఉర్దూ భాషను అర్థం చేసుకున్నందున ఉర్దూను నేమ్‌బోర్డుల్లో మున్సిపల్‌ కౌన్సిల్‌ అలానే ఉంచిందని కోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్‌ కౌన్సిల్‌ చేయాల్సిందల్లా సరైన కమ్యూనికేషన్‌ను రూపొందించడమే అని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నామని పేర్కొంది. 2022 చట్టం లేదా ఇతర ఏ చట్టంలోని నిబంధనల్లోనూ ఉర్దూ వాడకంపై నిషేధం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని ఆ పిటిషన్ ను కొట్టివేసింది.

అసలు కేసు ఏంటంటే?

కాగా.. మున్సిపల్‌ కౌన్సిల్‌ పరిధిలోని నేమ్‌ బోర్డులపై మరాఠీతో పాటు ఉర్దూను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్రలోని అకోలా జిల్లా పాటూరు మాజీ కౌన్సిలర్‌ వర్షతాయ్‌ సంజయ్‌ బగాడే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. మున్సిపల్‌ కౌన్సిల్‌లో జరిగే పనులన్నీ మరాఠీ భాషలోనే చెప్పాలని.. ఉర్దూను సైన్‌ బోర్డులపై ఉపయోగించడానికి అనుమతించకూడదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ఆమె అభ్యర్థనను మున్సిపల్‌ కౌన్సిల్‌ తిరస్కరించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. దాన్ని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Next Story