చెక్ రిపబ్లిక్‌ సుందరి క్రిష్టియానా సిస్కోవాకు మిస్ వరల్డ్ కిరీటం

by Dishanational4 |
చెక్ రిపబ్లిక్‌ సుందరి క్రిష్టియానా సిస్కోవాకు మిస్ వరల్డ్ కిరీటం
X

దిశ, నేషనల్ బ్యూరో : 71వ మిస్ వరల్డ్ కిరీటాన్నిచెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిష్టియానా సిస్కోవా కైవసం చేసుకున్నారు. మొదటి రన్నరప్‌గా లెబనాన్‌ సుందరి యాస్మినా జైతూన్ నిలిచారు. శనివారం ముంబైలోని బీకేసీలో ఉన్న జియో వరల్డ్ సెంటర్‌ వేదికగా ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల ఫైనల్ ఈవెంట్ ఉత్కంఠగా జరిగింది. ఈ ఈవెంట్‌ను 140కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత యువతి సిని శెట్టి తుది రౌండ్ దాకా చేరలేకపోయింది. అత్యంత కీలకమైన టాప్ - 4 జాబితాలోనూ ఆమె చోటు సంపాదించలేకపోయింది. టాప్-4 జాబితాలో క్రిష్టియానా సిస్కోవా(చెక్ రిపబ్లిక్), యాస్మినా జైతూన్ (లెబనాన్), అచే అబ్రహామ్స్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో), లెసెగో చోంబో (బోట్స్వానా) నిలిచారు. అంతకుముందు చివరగా టాప్ -12 జాబితాలో సిని శెట్టికి చోటు దక్కింది. ఆమెతో పాటు బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, ట్రినిడాడ్ టొబాగో, బోట్స్‌వానా, మారిషస్, ఉగాండా, చెక్ రిపబ్లిక్, ఇంగ్లండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, లెబనాన్‌లకు చెందిన అందాల సుందరులు టాప్-12 లిస్టులో ఉన్నారు.

న్యాయనిర్ణేతలు వీరే..

28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశం 71వ మిస్ వరల్డ్ పోటీని నిర్వహించింది. ప్రతిష్టాత్మకమైన ఈ కిరీటం కోసం 115 దేశాల నుంచి అందాల సుందరులు పోటీ పడ్డారు. ఈ ఫైనల్ పోటీలలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖుల్లో మిస్ వరల్డ్ 2017 విజేత మానుషీ చిల్లర్, నటీనటులు కృతి సనన్, పూజా హెగ్డే, జూలియా మోర్లే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్ అండ్ సీఈఓ, సినీ నిర్మాత సాజిద్ నదియాడ్ వాలా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, వార్తా ప్రముఖుడు రజత్ శర్మ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కరణ్ జోహర్,మిస్ వరల్డ్ 2013 విజేత మేగాన్ యంగ్ సంయుక్తంగా హోస్ట్ చేశారు.ఇంతకు ముందు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల్చుకున్న భారతీయుల జాబితాలో రీటా ఫారియా పావెల్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, డయానా హేడెన్, యుక్తా ముఖీ, ప్రియాంక చోప్రా జోనాస్ ఉన్నారు.

Next Story