Kharge: జనగణన వెంటనే ప్రారంభించాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by B.Srinivas |

దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న జనగణన, కుల గణనను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విజ్ఞప్తి చేశారు.

Kharge: జనగణన వెంటనే ప్రారంభించాలి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న జనగణన, కుల గణనను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా చాలా మంది సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. రాజ్యసభలో బుధవారం జీరో అవర్ సందర్భంగా ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు.1881 నుంచి భారత్ ప్రతి పదేళ్ల కోసారి జనాభా గణనను నిర్వహిస్తోందని తెలిపారు. యుద్ధాలు, అత్యవసర పరిస్థితులు, ఇతర సంక్షోభాల సమయంలోనూ చేపట్టారన్నారు. రెండో ప్రపంచ యుద్ధం,1971-72లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం వంటి ప్రధాన సంఘటనల సమయంలో నూ జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. "కానీ చరిత్రలో మొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈ ప్రక్రియను జాప్యం చేసిందని, ఇది ఎంతో దురదృష్టకరమని అభివర్ణించారు.

‘జనాభా గణన చాలా కీలకమైంది. జనాభాపై మాత్రమే గాక ఉపాధి, కుటుంబ నిర్మాణాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, అనేక ఇతర అంశాలపై ఈ ప్రక్రియ ఆధారపడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల డేటాను సేకరిస్తున్నందున సాధారణ జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా సాధ్యమే’ అని తెలిపారు. ఈ అంశపై ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని తెలిపారు. కొవిడ్ టైంలోనూ 81 దేశాలు విజయవంతంగా జనాభా గణనను పూర్తి చేశాయన్నారు. జనాభా లెక్కలను ఆలస్యం చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, జాతీయ ఆహార భద్రతా చట్టం, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వంటి అనేక కీలకమైన సర్వేలు జనాభా లెక్కల డేటాపై ఆధారపడి ఉన్నాయన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Next Story