డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నటులకు నోటీసులు ఇచ్చిన ఈడీ

by Malleboina Mahesh |

తమిళనాడులోని చెన్నైలో డ్రగ్స్ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. తమిళ సినీ నటులు శ్రీరామ్ (Srikanth), కృష్ణ ఈ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) వారిపై దృష్టి సారించింది.

డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నటులకు నోటీసులు ఇచ్చిన ఈడీ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని చెన్నైలో డ్రగ్స్ కేసు (Drug case) మరోసారి సంచలనం సృష్టించింది. తమిళ సినీ నటులు శ్రీరామ్ (Srikanth), కృష్ణ ఈ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) వారిపై దృష్టి సారించింది. కోకైన్ కొనుగోలు, వినియోగం, అలాగే డబ్బు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే చెన్నై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల వివరాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులు ఇద్దరు నటులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. గత జూన్‌లో చెన్నై నంగనల్లూర్ ప్రాంతంలో జరిగిన డ్రగ్స్ రాకెట్‌పై పోలీసు దర్యాప్తు సమయంలో ఈ ఇద్దరు నటుల పేర్లు బయటపడ్డాయి. డిజిటల్ సాక్ష్యాలు, వాట్సాప్ చాట్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్ రికార్డులు వంటి ఆధారాల ఆధారంగా పోలీసు అధికారులు వారిని విచారించారు.

అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేయగా.. మద్రాస్ హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఈ కేసుపై ఈడీ అధికారులు దృష్టి పెట్టగా.. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఖాతాల ద్వారా ప్రవహించింది. అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌కు లింకులు ఉన్నాయా అనే అంశాలపై ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకా ఈడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, విచారణలో ఉన్న ఇద్దరు నటులకు అదనపు ప్రశ్నల కోసం నోటీసులు పంపినట్లు కొన్ని వార్తా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు పర్యవేక్షణలో పోలీసులు, ఈడీ సంయుక్తంగా విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు ఇరుక్కోవడంతో తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది.

Next Story