- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం కీలక నిర్ణయం.. న్యూస్ ఛానళ్లకు TRP రేటింగ్ల నిలిపివేత
దేశంలోని వార్తా ఛానళ్లలో పెరుగుతున్న సంచలనాత్మక ధోరణిని అరికట్టేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్డెస్క్: దేశంలోని వార్తా ఛానళ్లలో పెరుగుతున్న సంచలనాత్మక ధోరణిని అరికట్టేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. న్యూస్ ఛానళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(TRP) నివేదికలను నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC)ను ఆదేశించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ వార్తా ఛానెళ్లు విపరీతమైన కవరేజీని అందిస్తున్నాయి. అయితే, కొన్ని ఛానళ్లు యుద్ధం గురించి ఊహాజనిత మరియు అతిశయోక్తితో కూడిన వార్తలను ప్రసారం చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. యుద్ధ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఉన్న ప్రజల్లో ఇటువంటి వార్తలు అనవసరమైన ఆందోళనను, భయాన్ని కలిగిస్తాయని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
నాలుగు వారాల పాటు నిషేధం..
రేటింగ్ల కోసం పోటీ పడుతూ, బాధ్యతను విస్మరించి సంచలనం కోసం వార్తలను ప్రసారం చేయడం సరికాదని కేంద్రం పేర్కొంది. "ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఛానెళ్లు యుద్ధానికి సంబంధించి అనవసరమైన హైప్ ఇస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రసారాలు చేస్తున్నాయి. రేటింగ్ల వేటలో పడి వార్తల్లో ఉండాల్సిన ప్రామాణికతను పక్కన పెడుతున్నారు," అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. వార్తా ఛానెళ్లకు వచ్చే ప్రకటనల ఆదాయాన్ని (Ad Revenue) నిర్ణయించడంలో టీఆర్పీ రేటింగ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నిషేధం నాలుగు వారాల పాటు అమల్లో ఉంటుంది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.






