ముస్లిం మహిళలు తలాఖ్ నమోదుకు కోర్టుకెళ్లాల్సిన అవసరం లేదు : హైకోర్టు

by Dishanational4 |
ముస్లిం మహిళలు తలాఖ్ నమోదుకు కోర్టుకెళ్లాల్సిన అవసరం లేదు :  హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : ముస్లిం పర్సనల్ లా ప్రకారం భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు.. విడాకుల సమాచారాన్ని నమోదు చేయించేందుకు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రతులు ఉంటేనే ఈ తరహా విడాకులను నమోదు చేస్తామనే నిబంధనను జనన, మరణాలు, వివాహాల రిజిస్ట్రార్ అమలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రిజిస్ట్రార్లు నేరుగానూ ఈ పనిని చేయొచ్చని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈమేరకు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ముస్లింలలో విడాకులు ఇచ్చిన పురుషులు వెంటనే పెళ్లి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుండగా.. విడాకులు పొందిన మహిళలు మాత్రం తమ వివాహాన్ని అధికారికంగా రద్దు చేయాలని కోరుతూ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఇబ్బందులకు దారితీసిన 2008 నాటి చట్టపరమైన నిబంధనల్లో సవరణలు చేసి.. మహిళా హక్కులను కాపాడాలని కేరళ శాసనసభకు కోర్టు ధర్మాసనం సూచించింది. తలాక్ సంబంధిత సమస్యను ఎదుర్కొన్న ఓ ముస్లిం మహిళ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Next Story

Most Viewed