Kerala: నిధులు కావాలంటే కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటించండి.. జార్జ్ కురియన్

by B.Srinivas |

కేంద్ర బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశపర్చిందని కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జార్జి కురియన్ స్పందించారు.

Kerala: నిధులు కావాలంటే కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటించండి.. జార్జ్ కురియన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశపర్చిందని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జార్జి కురియన్ (George Kurian) స్పందించారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలంటే కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటించాలన్నారు. అటువంటి రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఆర్థిక ప్యాకేజీలు అందిస్తుందని నొక్కి చెప్పారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ‘అధ్వాన్నమైన రోడ్లు, విద్య, మౌలిక సదుపాయాలతో కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటిస్తే, ఆర్థిక సంఘం పరిస్థితిని అంచనా వేస్తుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేరళ వెనుకబడి ఉండాలని కేంద్రం కోరుకుంటోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ (Govindan) తెలిపారు. బీజేపీ కేరళ వ్యతిరేక థోరణితో ఉందని, రాష్ట్రానికి చెందిన నాయకులే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అంతకుముందు సీఎం విజయన్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశపర్చిందని తెలిపారు. వయనాడ్‌ను పునర్నిర్మించడానికి నిధులు, రూ.24000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీపై తాము చేసిన అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కాగా, 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Next Story