Gujarat లో సౌండ్ Delhi లో రీసౌండ్.. గురితప్పని మఫ్లర్ వాలా ప్లాన్

by Dishanational2 |
Gujarat లో సౌండ్ Delhi లో రీసౌండ్.. గురితప్పని మఫ్లర్ వాలా ప్లాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ కనపరిచింది. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య నెలకొన్న హోరాహోరీ పోరులో అర్వింద్ కేజ్రీవాల్ దే పై చేయి అయింది. 250 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 136 స్థానాల్లో గెలిచి ఆమ్ ఆద్మీ మేయర్ పీఠం కైవసం చేసుకోగా, 100 చోట్ల గెలిచిన బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 10 స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో వరుసగా సత్తా చాటుతూ వస్తున్న ఆమ్ ఆద్మీకి ఎంసీడీ ఎన్నికలు ఓ సవాలుగా మారాయి. ఎందుకంటే అసెంబ్లీ మినహా పార్లమెంట్, స్థానిక సంస్థల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపకపోవడం ఆ పార్టీకి పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ సారి జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ బలమేంటో నిరూపించాలనుకున్న కేజ్రీవాల్ కు ఇటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు అటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు రావడం సంక్లిష్ట పరిస్థితిగా మారింది. దీంతో కేజ్రీవాల్ కు రెండు పడవల ప్రయాణం తప్పలేదు. ఓ వైపు ఆమ్ ఆద్మీని జాతీయ పార్టీగా మార్చాలంటే గుజరాత్ లేదా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో చెప్పుకోదగ్గ సీట్లు సాధించుకోవాలి. మరో వైపు సొంత రాష్ట్రంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వద్ద ఉన్న అధికారం తన వైపు తీసుకోవాలనే టార్గెట్. దీంతో ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి.

గుజరాత్ లో సౌండ్ ఢిల్లీలో రీసౌండ్:

ఒకేసారి ఎన్నికలు రావడంతో కేజ్రీవాల్ కు అసలైన అగ్నిపరీక్ష ఎదురైందనే టాక్ ఎన్నికలకు ముందు వినిపించింది. ఆప్ లో తానొక్కడే చెప్పుకోదగిన నేత. ప్రచారం చేసినా తన ఫేస్ తోనో ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కేజ్రీవాల్ రెండు పడవల సిద్ధాంతాన్ని ఎంచుకున్నట్టు రాజకీయ పండితులు విశ్లేషణలు చేశారు. గుజరాత్ లో సౌండ్ చేస్తే అది ఢిల్లీలో రీసౌండ్ అయ్యేలా ప్రణాళిక వేశారని అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదంటారు. పంజాబ్ లో భారీ విజయం నమోదుతో గుజరాత్ అసెంబ్లీకి ప్రయత్నం చేయడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటేలా ప్రణాళిక వేసుకున్న కేజ్రీవాల్.. పనిలో పనిగా గుజరాత్ ప్రచారమే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు ఉపయోగపడేలా పక్కాగా వ్యవహరించారనే టాక్ వినిపించింది.

గుజరాత్ లో కాంగ్రెస్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ కొల్లగొట్టబోతోందని మొదటి నుంచి తన విషయంలో ప్రచారం జరిగేలా కేజ్రీవాల్ చాకచక్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇందుకోసం అనూహ్యంగా కరెన్సీ నోట్లపై హిందూ దేవతామూర్తుల చిత్రపటాలు ముద్రించాలనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. అంతే కాదు గుజరాత్ లో బీజేపీని ఇరుకున పెట్టేలా విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇంత జరిగినా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆమ్ ఆద్మీకి చెప్పుకోదగిన సీట్లు రావడం లేదని తేల్చాయి. అయితే మోడీ, అమిత్ షా ల సొంత రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటాలనుకోవడం అంతా సులభతరమైన పని కాదనేది కేజ్రీవాల్ కు తెలియనిది కాదు. అందువల్లే ఢిల్లీ మున్సిపల్ లో చీపురు గుర్తు పార్టీ హావా సాగాలంటే గుజరాత్ లో మీట నొక్కాల్సిందే అనే వ్యూహంతో కేజ్రీవాల్ ముందుకు వెళ్లాడని ఆ దెబ్బ ఫుల్ గా వర్కౌట్ అయిందనే టాక్ ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంసీడీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో మఫ్లర్ వాలా ఏ మేరకు సత్తా చాటుతాడనేది ఆసక్తిగా మారింది.

Next Story