ఈవీ బైక్ ట్యాక్సీలను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం

by Dishanational1 |
ఈవీ బైక్ ట్యాక్సీలను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం మహిళా దినోత్సవం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈవీ బైక్ ట్యాక్సీలు మహిళలకు సురక్షితం కాకపోవడం, మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2021 నాటి ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్‌ను ఉపసంహరించుకుంటున్నామని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 'కొన్ని ప్రైవేట్ యాప్ ఆధారిత సంస్థలు మోటారు వాహనాల చట్టం, దాని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని గుర్తించాం. ప్రయాణాలకు అనుకూల కాని ఇటువంటి ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా ఉపయోగిస్తునట్టు తమ దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో ఈ స్కీమ్ కారణంగా పన్నులను వసూలు చేయడంలోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రయాణీకులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ఈవీ బైక్ రైడర్లు గొడవ పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రత, మహిళలకు రక్షణను పరిగణలోకి తీసుకుని వాటిని నిషేధిస్తున్నట్టు' ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీల కారణంగా లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని ఆటో, క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు గత కొన్నేళ్ల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి అనుమతులను రద్దు చేయాలని ఆటో రిక్షా, క్యాబ్, బస్సు ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇదే సమయంలో బైక్ ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళల పట్ల రైడర్లు అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు కూడా ప్రభుత్వ తాజా కారణమయ్యాయి.

Next Story

Most Viewed