జడ్జీపై అరిచాడు.. ఫైళ్లు విసిరాడు.. న్యాయవాదిపై కోర్టు ధిక్కారం కేసు

by Dishanational4 |
జడ్జీపై అరిచాడు.. ఫైళ్లు విసిరాడు.. న్యాయవాదిపై కోర్టు ధిక్కారం కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆ లాయర్ కోర్టులోనే తన ఆవేశాన్ని చూపించాడు. క్లయింట్ తరపున తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసినందుకు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఏకంగా గౌరవ న్యాయమూర్తిపైనే అరిచాడు. కోర్టుకు వ్యతిరేకంగా అవమానకర వ్యాఖ్యలు చేశాడు. తన దగ్గరున్న ఫైళ్లను విసిరాడు.తదుపరి పరిణామాల గురించి తాను బాధపడటం లేదని కామెంట్ చేశాడు. ఈ చేష్టలకు పాల్పడిన న్యాయవాది ఎం.వీరభద్రయ్యపై కోర్టు ధిక్కార కేసును నమోదు చేయాలని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ హేమలేఖ ఆదేశించారు. ‘‘ఆ న్యాయవాది తప్పుడు ప్రవర్తన వల్ల న్యాయస్థానం గౌరవం దెబ్బతింది.న్యాయస్థానం కార్యకలాపాలకు విఘాతం కలిగింది’’ అని న్యాయమూర్తి తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తరపున కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్) కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన కేవియట్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది ఎం.వీరభద్రయ్య ఫిబ్రవరి 5న వాదనలు వినిపించారు. అయితే ఈ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. నాలుగు వారాల్లోగా కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.10వేల జరిమానా చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ ఆర్డర్ విన్న తర్వాతే లాయర్ వీరభద్రయ్య సహనం కోల్పోయి, కోర్టులో అభ్యంతరకరంగా ప్రవర్తించారు.



Next Story