కర్ణాటక సీఎం సహా ప్రముఖులకు బాంబు బెదిరింపులు

by Dishanational1 |
కర్ణాటక సీఎం సహా ప్రముఖులకు బాంబు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి బాంబు బెదిరింపులు రావడం ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి, బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు మార్చి 2న ఈ బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరిస్తూ దుండగులు మెయిల్‌లో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు సోమవారం షాహిద్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. ఇటీవలే రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటన జరిగింది. ఇది జరిగిన వారంలోపే మరో బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

శనివారం మధ్యాహ్నం వచ్చిన ఈ-మెయిల్‌లో బెంగళూరులోని రద్దీ ప్రాంతాలతో పాటు రెస్టారెంట్లు, ఆలయాలు, బస్సులు, రైళ్లలోనూ, రాష్ట్రం సీఎం సహా ప్రముఖులు లక్ష్యంగా దాడులు జరుగుతాయని దుండగులు హెచ్చరించారు. బాంబు పేలుళ్లు జరగకూడదంటే 2.5 మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. తమ డిమాండ్లను సోషల్ మీడియాలో బహిర్గత చేస్తామని, తదుపరి దాడికి సంబంధించిన సమాచారాన్ని ట్వీట్ చేస్తామని నిందితులు పేర్కొన్నారు. ఈ బెదిరింపు మెయిల్ బూటకమని అనిపిస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో నిఘాను పెంచామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కాగా, మార్చి 1న రాజాజీనగర్‌లోని రామేశ్వరం కెఫెలో బాంబు పేలుడు సంబంధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును రాష్ట్ర హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది.


Next Story

Most Viewed