లంచం తీసుకున్న కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

by Disha Web Desk 2 |
లంచం తీసుకున్న కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
X

బెంగళూరు: ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి షాక్ తగలింది. లంచం తీసుకున్న కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప అరెస్టయ్యారు. సోమవారం తన నియోజకవర్గం ఛన్నగిరి నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో క్యథసంద్ర టోల్ బూత్ సమీపంలో లోకాయుక్త పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మెన్‌గా ఉన్న విరూపాక్షప్ప తన కొడుకు ప్రశాంత్ మదల్ రూ.40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కొద్ది రోజులకే చైర్మెన్ పదవిని వీడారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యేను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

ఈ క్రమంలో చేపట్టిన సోదాల్లో ఎమ్మెల్యే ఇంట్లో రూ.8 కోట్లు సీజ్ చేశారు. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని విరూపాక్షప్ప చెప్పారు. తన కుమారుడు కూడా అమాయకుడని తెలిపారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో తాజాగా అరెస్టు కావడం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. గతంలోనూ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇది కాస్తా విపక్ష కాంగ్రెస్‌కు విమర్శనాస్త్రంగా మారింది. బీజేపీ అంటే 40 పర్సెంట్ కమిషన్ పార్టీ అని దుయ్యబట్టారు. మరోవైపు ఎన్నికల వేళ కాషాయపార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడిందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.



Next Story

Most Viewed