ఎన్డీఏలోకి ఆర్‌ఎల్‌డీ జంప్.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
ఎన్డీఏలోకి ఆర్‌ఎల్‌డీ జంప్.. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’కు ఉత్తరప్రదేశ్‌లో మరో షాక్ తగలబోతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) పార్టీ ఎన్డీఏ కూటమిలోకి జంప్ అవుతుందని తెలుస్తోంది. మంగళవారం రోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జయంత్ భేటీ అయ్యారని సమాచారం. ఈనేపథ్యంలో ఆర్‌ఎల్‌డీకి ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జయంత్ చౌదరి చాలా ముక్కుసూటిగా ఉండే నాయకుడు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. రాజకీయాలను జయంత్ బాగా అర్థం చేసుకోగలరు. ఆయన తీసుకునే నిర్ణయం రైతుల పోరాటాన్ని బలహీనం చేసేలా ఉండదని నేను అనుకుంటున్నాను’’ అని అఖిలేష్ కామెంట్ చేశారు. ఇక పొత్తులపై మీడియా ముందు ఏదీ మాట్లాడొద్దంటూ తన పార్టీ నేతలందరిని జయంత్ చౌదరి ఆదేశించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఛప్రౌలీలో తన తాత చౌదరి చరణ్‌సింగ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని జయంత్ అకస్మాత్తుగా వాయిదా వేశారు. బీజేపీ, ఆర్‌ఎల్‌డీ మధ్య పొత్తు కుదిరితే.. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జయంత్.. గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌కు గైర్హాజరవడం లేదు. ఇది కూడా ఎన్డీఏతో ఆర్‌ఎల్‌డీ పొత్తు కుదరబోతోందనే దానికి సంకేతమేనని అంచనా వేస్తున్నారు.


Next Story