రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు.. ఉద్యోగులకు బీబీసీ కీలక సూచనలు

by Disha Web Desk 4 |
రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు.. ఉద్యోగులకు బీబీసీ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మొదలైన సోదాలు రాత్రి వరకు జరిగాయని, బుధవారం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బీబీసీ తమ సంస్థ ఉద్యోగులకు మెయిల్ పంపింది.

బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్ మెంట్‌లో పనిచేసే వారు మినహా మిగతా వారు ఆఫీసుకు రానక్కర్లేదని, వర్క్ ఫ్రం హోం చేయాలని మెయిల్‌లో సూచించింది. అంతేకాకుండా ఐటీ అధికారుల సోదాలకు సహకరించాలని మరోమారు సూచించింది. జీతానికి సంబంధించిన వివరాలను అడిగితే చెప్పాలని, కానీ వ్యక్తిగత ఆదాయ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరంలేదని సూచించినట్లు తెలుస్తోంది.

లాగే ఈ సర్వే గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించవద్దని ఇదివరకే సిబ్బందికి సంస్థ స్పష్టం చేసింది. కాగా, పన్ను ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతోనే బీబీసీ ఆఫీసుల్లో సర్వే చేస్తున్నట్లు ఐటీ అధికారులు మంగళవారం వెల్లడించారు. పలు అంశాలకు సంబంధించి సంస్థ లెక్కల్లో చూపించిన ఖర్చులపై సందేహాలు ఉన్నాయని అన్నారు.

మరోవైపు, గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉందని 'ఇండియా: ద మోదీ క్వశ్చన్‌' పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. అల్లర్లపై సుప్రీంకోర్టులోనే మోడీకి క్లీన్‌చిట్‌ లభించాక బీబీసీ ఇలాంటి అభాండాలు వేయడమేంటని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed