ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-13 02:55:17  IST  )

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌ (Iran), ఇజ్రాయెల్‌ (Israel) మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ ఘాటు వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, గార్డ్‌కు చెందిన మరికొంత మంది టాప్‌ అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.

1979లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవం అనంతరం ఏర్పాటైన IRGC, దేశంలోని అత్యంత శక్తిమంతమైన సైనిక, రాజకీయ సంస్థల్లో ఒకటి. బాలిస్టిక్ క్షిపణుల యూనిట్లను నియంత్రించడం దీని ప్రత్యేకత. గాజా యుద్ధ సమయంలో ఇరాన్ ఈ గార్డు ద్వారా ఇజ్రాయెల్‌పై రెండు సార్లు క్షిపణి దాడులు కూడా చేసింది.

ఇక ఇజ్రాయెల్ చేపట్టిన ఈ తాజా దాడికి ‘రైజింగ్ లయన్’ (Rising Lion) అనే కోడ్ నేమ్‌ పెట్టింది. ఇది అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, క్షిపణుల తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నదిగా ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే, దాడులకు ప్రతీకారం తీర్చే అవకాశముందని భావించిన ఇజ్రాయెల్‌, దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు, అమెరికా (USA) ఈ దాడులను నివారించమని ముందుగానే హెచ్చరించినప్పటికీ, టెల్‌అవీవ్‌ (Tel Aviv) వాటిని పట్టించుకోకుండా తన దాడులను కొనసాగించిన తీరు గమనార్హం.

Next Story