బీబీసీ కార్యాలయాలపై సర్వే చేసిన ఐటీ శాఖ కీలక ఆరోపణలు

by Vinod kumar |
బీబీసీ కార్యాలయాలపై సర్వే చేసిన ఐటీ శాఖ కీలక ఆరోపణలు
X

న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు బీబీసీ కార్యాలయాలపై సర్వే చేసిన ఐటీ శాఖ కీలక ఆరోపణలు చేసింది. సర్వేలో అకౌంట్ పుస్తకాల్లో అవకతవకలను గుర్తించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు గుర్తించామని వెల్లడించింది. అయితే ఉద్యోగులు స్టేట్‌మెంట్లు, డిజిటల్ ఫైల్స్, డాక్యుమెంట్లను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. కొన్ని లావాదేవీల్లో పన్ను కట్టలేదని సోదాల్లో తేలింది. సమూహంలోని విదేశీ సంస్థలు భారతదేశంలోని నిర్దిష్ట చెల్లింపులపై పన్ను చెల్లించలేదని పరిశోధనలు సూచిస్తున్నాయని ఐటీ పేర్కొంది.

బదిలీలకు సంబంధించిన డాక్యుమెంటేషన్లోనూ సర్వే అనేక వ్యత్యాసాలు, అసమానతలను కనుగొన్నట్లు వెల్లడించింది. బీబీసీ సిబ్బంది దర్యాప్తును ఆలస్యం చేసే ఎత్తులు వేస్తున్నారని ఐటీ ఆరోపించింది. సెకండెంట్ ఉద్యోగులను నియమించుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది. దీనిపై సంబంధింత అధికార సంస్థకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది.

అయితే దీనిపై బీబీసీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితం బీబీసీ ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఓ డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీబీసీ పై కేంద్రం విమర్శలకు దిగింది. డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా ఆంక్షలు విధించింది. తాజాగా ఐటీ శాఖ సర్వే చేయడం చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed