ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ

by Ramesh Naini |   (  Updated:2026-03-01 17:28:13  IST  )

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం తమిళనాడు పర్యటన ముగించుకుని రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ తన నివాసంలో ఈ మీటింగ్‌కు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులు, భారత్‌పై పడే ప్రభావాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.

ప్రత్యేకంగా ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రధానంగా దృష్టి సారించనున్నారని, అవసరమైతే అత్యవసర తరలింపు చర్యలు చేపట్టేందుకు సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార చర్యలతో పశ్చిమ ఆసియా మొత్తం ఉద్రిక్తతలతో మండిపోతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.

Next Story