పార్లమెంట్ వద్ద ఆసక్తికర దృశ్యం.. కేంద్ర మంత్రుల చేయి పట్టుకున్న రాహుల్ గాంధీ.. తప్పించుకున్న జోషి

by Ramesh Naini |

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఒక అరుదైన సన్ని వేశం చోటుచేసుకుంది.

పార్లమెంట్ వద్ద ఆసక్తికర దృశ్యం.. కేంద్ర మంత్రుల చేయి పట్టుకున్న రాహుల్ గాంధీ.. తప్పించుకున్న జోషి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఒక అరుదైన సన్ని వేశం చోటుచేసుకుంది. లోక్‌సభలో బడ్జెట్‌పై విరుచుకుపడిన అనంతరం బయటకు వచ్చిన రాహుల్ గాంధీ, నేరుగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతున్న చోటుకు వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తప్పుబడుతూ మీడియాకు 'బైట్స్' ఇస్తుండగా, రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి అక్కడికి చేరుకున్నారు. మంత్రులను చూసి నవ్వుతూ.. ‘విడివిడిగా ఎందుకు, కలిసి ఇంటర్వ్యూ ఇద్దాం రండి’ అంటూ సరదాగా ప్రతిపాదించారు. అంతేకాకుండా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేయి పట్టుకుని తన వైపునకు ఆహ్వానించారు. అయితే, రాహుల్ గాంధీ చర్యతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన మంత్రులు ఇద్దరూ ఆయన ప్రతిపాదనను తిరస్కరించి, అక్కడి నుంచి త్వరత్వరగా వెనుదిరిగారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

భారత మాతను అమ్మేసిన ప్రభుత్వం..

అంతకుముందు లోక్‌సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ చర్చలో పాల్గొంటూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్-అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ‘భారత మాతను అమ్మేసింది’ అని ఆరోపించారు. వివాదాస్పద జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశాన్ని సభలో ప్రస్తావించే ప్రయత్నం చేయగా, స్పీకర్ పీఠం దానిని వారించింది. రాహుల్ ప్రసంగం అంతా అబద్ధాలమయమని, ఆయన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.

Next Story