Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఈ నెల 10 వరకు ఆ విమానాలన్నీ రద్దు

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడికి బదులుగా ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ పేరుతో భారత్ పాక్ పై పగ తీర్చుకుంది. పాకిస్థాన్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్..  ఈ నెల 10 వరకు ఆ విమానాలన్నీ రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి బదులుగా ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ పేరుతో భారత్ పాక్ పై పగ తీర్చుకుంది. పాకిస్థాన్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల దృష్ట్యా భారత గగనతలంలో కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో, అనేక విమానసర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే విమానాయాన సంస్థ ఇండిగో (IndiGo) కీలక ప్రకటన చేసింది. మే 10 వరకు 165కు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ స్పేస్ ఆంక్షలతో అమృత్‌సర్‌, బికనీర్‌, చండీగఢ్‌, ధర్మశాల, గ్వాలియర్‌, జమ్ము, జోధ్‌పుర్‌, కిషన్‌గఢ్‌, లేహ్‌, రాజ్‌కోట్‌, శ్రీనగర్‌ సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి మే 10 ఉదయం 5.30 గంటల వరకు 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను చూసుకోవాలని తెలిపింది. ఆ విమాన ప్రయాణికులు రీషెడ్యూల్‌ లేదా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, క్యాన్సిల్‌ చేసుకుంటే పూర్తి రీఫండ్‌ కూడా ఇస్తామని పేర్కొంది.

ఎయిర్ ఇండియా ప్రకటన..

మరో విమానయానసంస్థ ఎయిర్‌ఇండియా (AirIndia) కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. మే 10 ఉదయం వరకు శ్రీనగర్‌, జమ్ము, లేహ్‌, జోధ్‌పుర్‌, అమృత్‌సర్‌, భుజ్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, చండీగఢ్‌ ఎయిర్‌పోర్టులకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు వన్‌టైమ్‌ రీషెడ్యూల్‌ ఛార్జీల మినహాయింపు కల్పించింది. లేదా పూర్తి రీఫండ్‌ ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా, స్పైస్‌జెట్‌, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌ విమనాలు కూడా రద్దయ్యాయి. అంతేకాకుండా, బుధవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 18 ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్‌, లేహ్‌, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో, ప్రయాణికులు అప్ డేట్స్ చూసుకోవాలని విమానయాన సంస్థలు వెల్లడించాయి.

Next Story