New Zealand: న్యూజిలాండ్‌లో నీట మునిగి 21 ఏళ్ల భారత విద్యార్థి మృతి

by S Gopi |

ఏప్రిల్ 5న తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన శౌర్య, అకాసియా బే వద్ద నీటిలో మునిగిపోయాడు.

New Zealand: న్యూజిలాండ్‌లో నీట మునిగి 21 ఏళ్ల భారత విద్యార్థి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూజిలాండ్‌లోని లేక్ తౌపోలో ఈస్టర్ సెలవుల సందర్భంగా విహారయాత్రకు వెళ్లిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి శౌర్య శ్రీరామ్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌కు చెందిన వార్తా సంస్థ 'ఎన్‌జెడ్ హెరాల్డ్' నివేదించింది. ఏప్రిల్ 5న తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన శౌర్య, అకాసియా బే వద్ద నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు అతడిని ఒడ్డుకు చేర్చినప్పటికీ, అప్పటికే అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం రోటోరువా ఆసుపత్రికి తరలించగా, వైద్య సిబ్బంది విద్యార్థిని కాపాడే ప్రయత్నాలు చేశారు. అయితే, ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే శ్రీరామ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ముంబైలోని అతని కుటుంబం తీవ్ర విషాదంతో మునిగిపోయింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇరవై ఏళ్లకు పైగా న్యూజిలాండ్‌లో ఉండి, ముంబైలోని పోవాయిలో స్థిరపడేందుకు తిరిగి వచ్చిన సన్నీ, సుధా శ్రీరామ్‌ల ఏకైక కుమారుడు శ్రీరామ్. అతని తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు. శ్రీరామ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆక్లాండ్‌లోని భారత కాన్సుల్ జనరల్ మదన్ మోహన్ సేథి హామీ ఇచ్చారు. అయితే, అతని మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి దాదాపు 18,000 డాలర్లు (సుమారు రూ. 15-16 లక్షలు) ఖర్చవుతుందని అంచనా. దీనికోసం స్థానిక ప్రవాస భారతీయ సంఘాలు విరాళాలు సేకరిస్తున్నాయి.

Next Story