400 టర్కీ డ్రోన్లతో భారత్‌పై పాక్ దాడి..36 ప్రాంతాలు టార్గెట్..!

by Phanindra |

భారత్‌పై పాకిస్తాన్ 400 డ్రోన్లతో దాడి చేసిందని, ఇవన్నీ కూడా టర్కీకి చెందినవిగా గుర్తించినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది.

400 టర్కీ డ్రోన్లతో భారత్‌పై పాక్ దాడి..36 ప్రాంతాలు టార్గెట్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్‌.. భారత్ ప్రతిదాడిలో తీవ్రంగా నష్టపోయిందని రక్షణ శాఖ పేర్కొంది. శుక్రవారం నాడు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. భారత్‌పై దాడిలో టర్కీకి చెందిన ఆసిస్‌గార్డ్ సోంగార్ డ్రోన్‌లను పాక్ ఉపయోగించిందని ఆమె వెల్లడించారు. అలాగే కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. మే 7వ తేదీ రాత్రి పాకిస్తాన్ సైన్యం పలుమార్లు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిందని, లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు ఉన్న భారత మిలటరీ స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేసేందుకు ప్రయత్నించిందని వ్యోమికా తెలిపారు. సుమారు 400 డ్రోన్లతో మొత్తం 36 ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని చెప్పారు.

టర్కీ డ్రోన్లతో దాడి..: సోఫియా ఖురేషీ

‘ఈ డ్రోన్లను కెనెటిక్, నాన్-కెనెటిక్ విధానాల్లో భారత సైన్యం కూల్చేసింది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పరీక్షించడానికి, ఇంటెలిజెన్స్ సేకరించడానికే ఇంత పెద్ద స్థాయిలో భారత గగనతలంలోకి పాక్ చొచ్చుకొచ్చింది. డ్రోన్ శిధిలాలపై ఫోరెన్సిక్ పరిశోధనలు జరుగుతున్నాయి. మా ప్రాథమిక విచారణలో ఇవన్నీ టర్కీకి చెందిన ఆసిస్‌గార్డ్ సోంగార్ డ్రోన్స్ అని తేలింది’ అని సోఫియా ఖురేషీ వివరించారు.

సివిల్ ఎయిర్‌లైన్స్ అడ్డుపెట్టుకొని..: వ్యోమికా సింగ్

అదే సమయంలో భారత్‌పై దాడికి తెగబడిన పాకిస్తాన్.. భారత ఎయిర్ డిఫెన్స్ స్పందిస్తుందని తెలిసినా కూడా పాక్ సివిల్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేయలేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పాక్ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలు కూడా భారత్, పాక్ సరిహద్దుల్లో ప్రయాణించాయని, వీరందరి ప్రాణాలను అడ్డుపెట్టుకొని భారత్‌పై పాక్ దాడులు చేసిందని ఆమె స్పష్టం చేశారు.

ఇది పాక్ దిక్కుమాలిన తెలివి: విక్రమ్ మిస్రీ

భారత్‌పై పాక్ చేసిన దాడికి భారత్ చాలా కచ్చితమైన సమాధానం ఇచ్చిందని, బాధ్యతాయుతమైన దేశం ఎలా స్పందించాలో అలాగే స్పందించిందని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ చెప్పారు. పాకిస్తాన్ కేవలం భారత సైనిక స్థావరాలనే కాకుండా సామాన్య ప్రజలు, సాధారణ నగరాలను కూడా టార్గెట్ చేసిందని ఆయన తెలిపారు. అమృత్‌సర్ వంటి ఆధ్యాత్మిక కేంద్రంపై దాడి చేసిన పాక్.. ఈ దాడి తాము చేయలేదని, భారత వాయుసేనే ఈ దాడి చేసి, తమపై రుద్దుతోందని వాదించడం వారి దిక్కుమాలిన తెలివికి నిదర్శనమని మిస్రీ అన్నారు. ఇలాంటి ఊహలు కేవలం పాకిస్తాన్ మాత్రమే చేయగలదంటూ వెటకారమాడారు.

Next Story