జులై 24న ట్రేడ్‌ డీల్‌పై సంతకాలు.. మోడీతోపాటు యూకేకు పీయూష్ గోయల్

by Phanindra |

జులై 24న యూకే, భారత్ ట్రేడ్‌ డీల్‌పై సంతకాలు చేసుకోనున్నాయి. దీనికోసం ప్రధాని మోడీతోపాటు పీయూష్ గోయల్ కూడా యూకేకు వెళ్లనున్నారట.

జులై 24న ట్రేడ్‌ డీల్‌పై సంతకాలు.. మోడీతోపాటు యూకేకు పీయూష్ గోయల్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూకేతో భారత్ చేసుకున్న ఒప్పందంపై ఈ నెల 24వ తేదీన ఇరుదేశాలు సంతకాలు చేయనున్నారు. దీని కోసం ప్రధాని మోడీతోపాటు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ కూడా యూకే వెళ్తారని అధికారులు చెప్తున్నారు. ఈ రెండు దేశాలు మే 6న వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగిశాయని, త్వరలోనే ఒప్పందంపై సంతకాలు చేసుకుంటామని ప్రకటించాయి. ఈ డీల్‌తో భారత్‌ నుంచి బ్రిటన్‌కు వెళ్లే లెదర్, ఫుట్‌వేర్, దుస్తుల వంటి ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలు తగ్గుతాయి.

అలాగే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చే విస్కీ, కార్ల ధరలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. 2030 నాటికి ఈ రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని 120 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, బుధవారం నుంచి ప్రధాని మోడీ నాలుగు రోజుల పాటు యూకే, మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమయంలోనే యూకే ట్రేడ్ డీల్‌పై సంతకాలు జరుగుతాయని తెలుస్తోంది.

Next Story