నేను బీఫ్ తింటాను.. దాన్ని ఎవ్వరూ ఆపలేరు : బీజేపీ నేత సంచలన కామెంట్స్

by Disha Web Desk 13 |
నేను బీఫ్ తింటాను.. దాన్ని ఎవ్వరూ ఆపలేరు : బీజేపీ నేత సంచలన కామెంట్స్
X

షిల్లాంగ్: బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ దేన్నయితే వ్యతిరేకిస్తున్నాయో దాన్నే సమర్థించారు మేఘాలయ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అర్నెస్ మావ్రీ. తాను కూడా గొడ్డు మాంసం (బీఫ్) తింటానని, మేఘాలయలో నిబంధనలేమీ లేవని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇతర రాష్ట్రాల తీర్మానంపై నేను మాట్లాడను. కానీ నేను మేఘాలయలో ఉన్నాను. ఇక్కడ అందరూ గొడ్డు మాంసం తింటారు. ఎటువంటి నిబంధనా లేదు. అవును, నేను కూడా బీఫ్ తింటాను. నిషేధం లేదు. ఇది మేఘాలయ ప్రజల జీవన శైలి. దీనిని ఎవ్వరూ ఆపలేరు.

భారత దేశంలో ఎక్కడా ఇలాంటి నియమం లేదు. కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయి. మేఘాలయలో కబేళా ఉంది. అక్కడికి ఆవును లేదా పందిని తీసుకొస్తారు. పరిశుభ్రమైన వాటినే తెస్తుండొచ్చు. ప్రజలు వాటికి అలవాటుపడ్డారు' అని మావ్రీ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం పశువధ, గోమాంసం రవాణా, విక్రయాల నియంత్రణ బిల్లును ఆమోదించింది. బీజేపీకి చెందిన అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వశర్మ ఆంక్షలు విధించారు. హిందువులు నివసించే చోట గొడ్డు మాంసం తినడం మంచిది కాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయితే బీజేపీ క్రైస్తవుల వ్యతిరేక పార్టీ అని కొంత మంది చేస్తున్న ఆరోపణలను మావ్రీ కొట్టిపారేశారు. అదంతా రాజకీయ ప్రచారం మాత్రమే అన్నారు. 'తొమ్మిదేళ్లుగా నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అధికారంలో ఉంది. దేశంలో ఏ చర్చిపైనైనా దాడి జరిగిందా? బీజేపీ క్రైస్తవుల వ్యతిరేక పార్టీ అని ప్రతిపక్షాలు ఆరోపించడం ఎన్నికల ప్రచారం మాత్రమే. మేఘాలయ క్రిస్టియన్ ఆధిపత్య రాష్ట్రం. అందరూ చర్చికి వెళతారు. గోవాలో కూడా బీజేపీ అధికారంలో ఉంది.

ఒక్క చర్చిని కూడా టార్గెట్ చేయలేదు. అలాగే నాగాలాండ్‌లో కూడా. ఇది కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు మరికొన్ని మిత్రపక్షాలు కూడా చేస్తున్న రాజకీయ ప్రచారం. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నేను కూడా క్రిస్టియన్‌నే. చర్చికి వెళ్లొద్దని వాళ్లు ఎప్పుడూ చెప్పరు' అని ఎర్నెస్ట్ మావ్రి వివరణ ఇచ్చారు. మేఘాలయలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఈనెల 27న మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Next Story

Most Viewed