‘ఆ పార్టీలో చేరి బానిసగా మారుతాడని అనుకోను!’

by Disha Web Desk 4 |
‘ఆ పార్టీలో చేరి బానిసగా మారుతాడని అనుకోను!’
X

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ సర్కార్‌ను గద్దె దించేందుకు సమిష్టి పోరాటం చేద్దామని విపక్ష పార్టీల మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఎన్సీపీ నేత అజిత్ పవార్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల ఆయన మోడీ విషయంలో సానుకూలంగా చేస్తున్న కామెంట్స్‌తో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ బీజేపీలో చేరుతారని తాను అనుకోవడం లేదని అన్నారు.

ఎన్‌సీపీతో అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని అందువల్ల ఆయన బీజేపీలో చేరి బానిసగా మారలేడనే పూర్తి విశ్వాసం తమకు ఉందని చెప్పారు. భవిష్యత్‌లో అజిత్ పవార్, నానా పటోలేలతో చర్చలు జరుపుతామని మే 16న నాగ్ పూర్‌లో ర్యాలీ నిర్వహించబోతున్నామని ఆ ర్యాలీకి ముందు వారితో మాట్లాడుతామన్నారు. కాగా మోడీ డిగ్రీ సర్టిఫికెట్ అంశంపై ఇటీవల అజిత్ పవార్ స్పందిస్తూ డిగ్రీ ఉందని మోడీకి ప్రజలు ఓట్లు వేయలేదని ఆయన చరిష్మా అధికారంలోకి తీసుకువచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అదానీ విషయంలో ప్రతిపక్షాల తీరును ఆక్షేపించారు. దీంతో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమికి బీటలు వారుతాయా అనే ఊహాగానాలు వినిపించాయి.



Next Story

Most Viewed