ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు: ప్రధాని నరేంద్ర మోడీ

by Dishanational2 |
ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు: ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇంధన వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారు అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్ తన అవసరాలు తీర్చుకోవడమే గాక ప్రపంచ అభివృద్ధి దిశను కూడా నిర్ణయిస్తుందన్నారు. గోవా పర్యటనలో ఉన్న మోడీ మంగళవారం సీ సర్వైవల్ సెంటర్ ఆఫ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాబోయే ఐదేళ్లలో ఇంధన రంగంలో భారత్ 67 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు. ‘భారత ప్రాథమిక ఇంధన డిమాండ్ 2045 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా వేశాం. దాని కోసం సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. గత వారం కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన రూ.11 లక్షల కోట్లలో ఎక్కువ భాగం ఇంధన రంగానికే కేటాయించినట్టు గుర్తు చేశారు. ప్రపంచ అంచనాల కంటే భారత వృద్ధి వేగం ఎక్కువగా ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారిందని కొనియాడారు. కాగా, మోడీ ప్రారంభించిన ఓఎన్‌జీసీ అనేది ఇంటిగ్రేటెడ్ సీ సర్వైవల్ ట్రైనింగ్ సెంటర్‌. భారతీయ సముద్ర రక్షణ చర్యలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి ఏటా పది వేల నుంచి పదిహేను వేల మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.


Next Story