సీఎం అల్పాహార విందులో షాక్.. ఆ ఆరుగురిపై వేటు

by Dishanational4 |
సీఎం అల్పాహార విందులో షాక్.. ఆ ఆరుగురిపై వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం సమసిపోయింది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా గురువారం వేటు వేశారు. క్రాస్ ఓటింగ్ చేసినందుకుగానూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారిని శాసన సభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అల్పాహార విందు భేటీ నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి 32 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు. మరో 8 మంది ఎమ్మెల్యేలు రాలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తూ స్పీకర్‌తో ప్రకటన చేయించింది. ఇంతకుముందు వరకు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. తాజాగా ఆరుగురిపై వేటు పడటంతో హస్తం పార్టీ బలం 34కు పడిపోయింది. ఈ పరిణామంతో రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 68 నుంచి 62కి తగ్గిపోయింది. ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కూడా 32కు డౌన్ కావడం అనేది కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడిని తగ్గించే అంశం. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలిపినా కాంగ్రెస్ సర్కారుకు వచ్చే గండమేదీ ఉండదు.



Next Story

Most Viewed