కశ్మీర్‌లో భారీ హిమపాతం: హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

by Dishanational2 |
కశ్మీర్‌లో భారీ హిమపాతం: హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్‌లో భారీ హిమపాతం కారణంగా జమ్మూ కశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. బందిపూర్, బారాముల్లా, కుప్వారా మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో అధిక హిమపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అంతేగాక రాబోయే 24 గంటల్లో దోడా, కిష్త్వార్, పూంచ్, రాంబన్, గందర్‌బల్ జిల్లాల్లో 2,200 మీటర్ల ఎత్తులో స్నో ఫాల్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా హిమపాతం సంభవించే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో అనేక జిల్లాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. మరోవైపు కశ్మీర్‌లో 9డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే బుధవారం నుంచి కశ్మీర్‌లో వాతావరణం మెరుగుపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విరిగిపడిన కొండచరియలు!

వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా షేర్ బీబీ ప్రాంతానికి సమీపంలోని కిష్త్వారీ పతేరి వద్ద జమ్మూ-శ్రీగనర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. రామ్సు, బనిహాల్, శ్రీనగర్ స్ట్రెచ్‌లోనూ భారీ హిమపాతం నమోదైనట్టు తెలిపాయి. అలాగే ప్రతికూల పరిస్థితుల కారణంగా ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్‌, శ్రీనగర్, లేహ్‌కు వెళ్లే మొత్తం 6 ఇండిగో విమానాలను అధికారులు రద్దు చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో మారని పరిస్థితి

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అధిక హిమపాతం కారణంగా సోమవారం 475 రోడ్లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో మంగళవారం నాలుగు జాతీయ రహదారులతో పాటు 676 రోడ్లను బ్లాక్ చేశారు. సిమ్లాలో అత్యధికంగా 242 రోడ్లను మూసివేశారు. 1,416 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోవడంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. గత రెండు రోజులుగా లాహౌల్-స్పితి, కిన్నౌర్, కులు, సిమ్లా మరియు చంబా జిల్లాల్లో భారీగా మంచు కురుస్తోంది.


Next Story