ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు: 33 మంది మృతి

by Dishanational2 |
ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు: 33 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్ఘనిస్థాన్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా సంభవించిన ఈ వర్షాల వల్ల పలు ఘటనల్లో 33 మంది మృతి చెందగా..మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తాలిబన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ వెల్లడించారు. రాజధాని కాబూల్‌తో పాటు పలు ప్రావిన్సులను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని తెలిపారు. దాదాపు 200 పశువులు చనిపోగా, 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. అలాగే వరదల కారణంగా దాదాపు 800 హెక్టార్ల వ్యవసాయ భూమి, 85 కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్లు దెబ్బతిన్నాయి. పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జబుల్, కాందహార్ ప్రావిన్సుల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని తెలిపారు.

దేశంలోని 34 ప్రావిన్సుల్లో దాదాపు 20 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రావిన్సుల్లో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ హిమపాతం, కొండచరియలు విరిగిపడటంతో 25 మంది మరణించారు. అఫ్ఘన్ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో మార్పులను ఎదుర్కొంటోందని గతేడాది ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. శాస్త్రవేత్తలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరింత తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆప్ఘన్ సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.

కాగా, 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆప్ఘనిస్థాన్‌కు విదేశీ సహాయం బాగా తగ్గిపోయింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలకు సహాయక ప్రతిస్పందనలకు ఆటంకం కలుగుతోంది. అయితే అధికారుల మద్దతుతో సహాయక సంస్థలు వరద బాధిత కుటుంబాలకు మానవతా సహాయం అందిస్తున్నప్పటికీ అవి తగినంతగా అప్ఘన్ ప్రజలకు అందడం లేదని తెలుస్తోంది.

Next Story

Most Viewed